ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి నందినికి స్వర్ణ పతకం

  • మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి విజయం
  • దక్షిణ కొరియాలోని గుమీలో పోటీలు
  • మొత్తం 5,941 పాయింట్లతో నందిని అగ్రస్థానం కైవసం
  • ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా గుర్తింపు
  • చివరి 800 మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శనతో గెలుపు
అంతర్జాతీయ అథ్లెటిక్స్ వేదికపై తెలుగు తేజం నందిని అగసర సత్తా చాటింది. సికింద్రాబాద్‌కు చెందిన యువ అథ్లెట్ నందిని అగసర, ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరుగుతున్న 26వ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో నందిని ఈ అద్భుత విజయాన్ని అందుకుంది.

ఏడు కఠినమైన క్రీడాంశాలతో కూడిన హెప్టాథ్లాన్‌లో నందిని అసాధారణ ప్రతిభ కనబరిచింది. పోటీ ఆద్యంతం హోరాహోరీగా సాగగా, ముఖ్యంగా చివరిదైన 800 మీటర్ల పరుగు పందెంలో ఆమె అద్భుత ప్రదర్శన చేసింది. ఈ పరుగును కేవలం 2 నిమిషాల 15.54 సెకన్లలో పూర్తి చేసి 885 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో (34.18 మీటర్లు) కొంత వెనుకబడినప్పటికీ, చివరి పరుగులో అద్భుతంగా పుంజుకుని విజయాన్ని ఖాయం చేసుకుంది. అన్ని ఈవెంట్లలో కలిపి నందిని మొత్తం 5,941 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ విజయంతో నందిని అగసర ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో 2005లో సోమా బిస్వాస్, 2017లో స్వప్నా బర్మన్ ఈ ఘనతను సాధించారు.

Nandini Agasara
Asian Athletics Championships
Heptathlon
Indian Athlete
Soma Biswas

More Telugu News